ఏపీ ఈసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్

  • ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల
  • మొత్తం 91.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
  • ఫలితాలను 'ఎక్స్' వేదికగా ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
  • అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లోనూ ర్యాంకు కార్డుల వెల్లడి
  • బీటెక్ సెకండియర్‌లోకి లేటరల్ ఎంట్రీ కోసం ఈ పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఈ ఫలితాలను 'ఎక్స్' వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 

పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఈ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది.

ఫలితాలు, ర్యాంకు కార్డులను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు, విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి వాట్సాప్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. తమ ఫోన్‌లోని వాట్సాప్ నుంచి 9552300009 నంబర్‌కు సందేశం పంపి కూడా ర్యాంకు కార్డును సులభంగా పొందవచ్చు.

ఫలితాల విడుదల ప్రక్రియ పూర్తవడంతో, త్వరలోనే అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది. విద్యార్థులు తదుపరి ప్రకటనల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

Nara Lokesh
AP ECET 2024
AP ECET Results
Engineering Entrance Exam
Andhra Pradesh Education
Lateral Entry
APSCHE
B.Tech Admissions
Diploma Courses
AP ECET Rank Card

More Telugu News